

సాలూరు ,మన న్యూస్:-పార్వతీపురం మన్యం జిల్లా, ప్రస్తుతం రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా 5,31,446 గర్భవతి బాలింత తల్లులు మరియు 13,03,384 మంది మూడు సంవత్సరాల లోపు పిల్లలు మరియు 7 లక్షల మంది 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఆరోగ్య మరియు పోషకాహార సేవలు అంగన్వాడీ సిబ్బంది ద్వారా అందజేయబడుచున్నవి. అంగన్వాడీ సిబ్బంది అనగా అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు తల్లీ పిల్లల ఆరోగ్యాని కై చేస్తున్న కృషి అభినందనీయం మరియు ప్రీస్కూల్ కార్యక్రమాల నిర్వహణలో కూడా కార్యకర్తలు చక్కగా పనిచేయుట కేంద్రాల సందర్శనలో గమనించడమైనది. ముఖ్యంగా 16-11-24వ తేదీన అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద వారి సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనలు చేసిన విషయం మా దృష్టికి వచ్చినది. అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది మరియు ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు మాసాలు మాత్రమే అయినది. దశలవారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటాము. సమ్మెలు ఆందోళనల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించబడవు మరియు సమ్మెలు చేసి కేంద్రాలు మూసివేయుట ద్వారా గర్భవతి బాలింత మహిళలు మరియు పిల్లలకు అత్యవసరమైన పోషకాహార సేవలు అందించుటకు ఆటంకం కలుగుచున్నది. అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యూటీ చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది కావున అంగన్వాడీ సిబ్బంది అందరూ సానుకూల దృక్పథంతో ఆలోచించి లబ్ధిదారులకు సేవల జారీలో ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడవలసినదిగాను మరియు ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు.