

తిరుపతి, మన న్యూస్:-స్థానికులకు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పునరుద్ధరిస్తూ టిటిడి పాలకమండలి తీర్మానం చేయడం పట్ల ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. స్థానికులకు నెలలో మొదటి మంగళవారం దర్శనం కల్పిస్తామని ఎన్డీఎ కూటమి ఇచ్చిన హామీని టిటిడి పాలకమండలి తొలి సంవేశంలోనే నెరవేర్చడం పట్ల సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టిటిడి చైర్మన్, సభ్యులు మరియు అధికారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం శ్రీవారి దర్శన టికెట్స్ ను అమ్ముకోవడానికి స్థానికుల దర్శన భాగ్యాన్ని రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్డీఎ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికులకు నెల నెలా శ్రీవారి దర్శన భాగ్యాన్ని పునరుద్ధరించాలని సిఎం చంద్రబాబు నాయుడు కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు తిరుపతి ఎమ్మెల్యే గా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. టిటిడి పాలకమండలి తొలి సమావేశంలోనే ఆ వినతి అమలుకు నిర్ణయం తీసుకోవడం పట్ల తిరుపతి ప్రజల తరుపున వీరందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కాగా 2019లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గరుడ వారధికి అలిపిరి వద్ద భూమి పూజ నిర్వహించారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. అయితే గత ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ఫ్లై ఓవర్ పేరు మార్చిందని ఆయన విమర్శించారు. టిటిడి పాలకమండలి తొలి సమావేశంలోనే ఫ్లై ఓవర్ పేరును తిరిగి గరుడ వారధిగా మార్చడం సంతోషంగా ఉందన్నారు. తిరుమల పవిత్రత ను పునః ప్రతిష్ఠించడమే లక్ష్యంగా టిటిడి పాలక మండలి అనేక నిర్ణయాలు తొలి సమావేశంలోనే తీసుకోవడం శుభపరిణామం అని ఆయన అన్నారు.