

Mana News, చిత్తూరు, మార్చి 6 : విద్యార్థులు చిన్నతనంలోనే నైతిక విలువలను పెంపొందించుకోవాలని, అలా చేస్తేనే జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుందని విశ్వం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్లు జయచంద్రారెడ్డి, చిట్టిబాబు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక సాంబయ్యకండ్రిగలో ఏర్పాటు చేసిన విశ్వం పబ్లిక్ స్కూల్ 18 వ వార్షికోత్సవాన్ని గురువారం మధ్యాహ్నం స్థానిక నాగయ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్లు మాట్లాడుతూ … క్రమశిక్షణతో విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు ముఖ్యంగా తల్లిదండ్రులను, గౌరవించడంతోపాటు నైతిక విలువలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదే క్రమంలో చదువుల విషయంలో అశ్రద్ధ చేయరాదని సూచించారు. 19 సంవత్సరాల క్రితం 200 మంది విద్యార్థులుతో ప్రారంభమైన తమ పాఠశాలలో నేడు 900 మందితో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పాఠశాలలోని అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల కృషితో ప్రతి ఏటా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నట్లు వివరించారు. ఈ కారణంగానే తమ పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయన్నారు. సువిశాల స్థలంలో, ప్రశాంత వాతావరణంలో నిర్మించిన తమ పాఠశాలలో విద్యకే కాకుండా క్రీడలు, సైన్స్ ఫెయిర్లు నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్సిడి ప్రొజెక్టర్ల ద్వారా విద్యాబోధన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటిలాగే ఇకపై సైతం తమను విద్యార్థుల తల్లిదండ్రులు ఆదరించాలని వారు కోరారు. కాగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు తదితరులు పాల్గొన్నారు.
