పెనుమూరు, మన ధ్యాస నవంబర్-21: ఈరోజు పెనుమూరు మండల పరిధిలోని శాతంభాకం, ఉగ్రాణం పల్లి, గుడ్యానం పల్లి, పెనుమూరు, ఎల్కేపీ తదితర ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టియు చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుండి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పునఃపరిశీలన పిటిషన్ దాఖలు చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విద్యాహక్కు చట్టం సవరణ చేయించి, రెండు వేలు తొమ్మిదో సంవత్సరానికి ముందు వివిధ డిఎస్సీల ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు టెట్ నుండి పూర్తి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయుల కోసం చైల్డ్ కేర్ లీవ్ సవరణ జీవో వెంటనే విడుదల చేసి, వయస్సుతో సంబంధం లేకుండా వారి సేవా కాలంలో ఎప్పుడైనా వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ఉమ్మడి సేవా నియమాలు రూపొందించి అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పన్నెండో వేతన సవరణ కమిషన్ను నియమించి, కనీసం ముప్పై శాతం మద్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులపై పెండింగ్లో ఉన్న సుమారు ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిలను దశలవారీగా విడుదల చేయాలని, నిల్వలో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పదవ తరగతి విద్యార్థుల వందరోజుల కార్యక్రమంలో సెలవు రోజులను మినహాయించాలని, గత విద్యా సంవత్సరంలో వందరోజుల కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులకు సీసీఎల్ హక్కు వెంటనే కల్పించాలని కోరారు. ఖాళీగా ఉన్న పిఎస్ హెచ్ఎం పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎస్టియు నాయకులు జానకిరాం, మణి, సుబ్రహ్మణ్యం పిళ్ళై, గణపతి, కుమార్ స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










