

శంఖవరం,మన న్యూస్ ప్రతినిధి (అపురూప్)______________________________________________ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరంలోని అంబేద్కర్ నగర్ లో ఒకరికి అనుమానస్పద డెంగీ కేసు నమోదు అయ్యింది. ఈమెకు తొలుత రౌతులపూడి ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. శంఖవరం మండల ప్రజా పరిషత్తు కార్యాలయం సమావేశం మందిరంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో శంఖవరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యులు శెట్టిబత్తుల శ్రీరామ్ రాజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు. శంఖవరం సచివాలయం 1 పరిధిలో ఎన్.ఎస్ 1 పోజిటివ్ డెంగీ కేసు బుధవారం ఉదయం నమోదు అయ్యింది. బాదితురాలు రౌతులపూడి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూంటే మాకు సమాచారం అందింది. రక్త పరీక్ష చేసాం. ఎన్.ఎస్ 1 పోజిటివ్ డెంగీ కేసుగా నిర్ధారణ అయింది. మామూలుగానే జ్వరం వస్తుంది. అయితే మందులను వాడుతూంటే ఇది ఐదు రోజుల్లోనే తగ్గిపోతుంది. రక్తంలో ప్లేట్ లెట్స్ మాత్రం పడిపోవు. ఈ ఎన్.ఎస్ 1 డెంగీ కాకుండా ఐజిఎం. ఐజిజి అనే రెండు రకాలు ఉన్నాయి. ఇవి సోకితే మాత్రం రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోతాయి. ఇప్పటి వరకూ మనకు ఐజిజి, ఐజిఎం. కేసులు నమోదు కాలేదు. శంఖవరం, పెదమల్లాపురం ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో నమోదు అవుతున్నవి అన్నీ ఎన్.ఎస్ 1 పోజిటివ్ డెంగీ కేసులే. శంఖవరం సచివాలయం 1 కేసు నేపధ్యంలో సాయంత్రం నుంచే డెంగీ సర్వే చేస్తున్నాం. బాధితురాలు ఇంటి చుట్టూ 50 గృహ సముదాయాల పరిధిలో సర్వే చేస్తున్నాం. ఇంకా ఈ సర్వే కొనసాగుతుంది. జూలై మాసం జ్వరాలకు అనుకూలం. అందువల్ల ఆస్పత్రి సిబ్బందికి తోడు పంచాయతీ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలి. నిత్యం సంపూర్ణ పారిశుధ్యం, రక్షిత తాగునీటి సరఫరాకూ పంచాయతీలు కృషి చేయాలి. అందుకు అవసరమైన మద్దతును వైద్య ఆరోగ్య శాఖ నుంచి అందిస్తాం. ఈ శంఖవరం కేసు నమోదుకు ముందు నుంచే మేం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం. ఆరోగ్యశాఖ నుంచి ఆస్పత్రి పరిధిలోని నాలుగు సచివాలయాల పరిధిలోని ఇళ్లలో దోమల మందును స్ప్రే చేస్తూ, వీధుల్లోని దోమల నివారణకు ఫాగింగ్ చేస్తూన్నాం. శంఖవరం ఆస్పత్రిలో ముగ్గురు స్టాఫ్ నర్సులు లేరు. ఉన్న ఆఫీసు సాంబార్డినేటర్ బదిలీపై వెళ్ళారు. పెదమల్లాపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్ లేరు. అందువల్ల పెదమల్లాపురంనకు శంఖవరం హెల్త్ సూపర్వైజరునే అప్పుడప్పుడూ పంపుతున్నాం. సంపూర్ణ, మెరుగైన వైద్య సేవలను అందించడానికి సిబ్బంది కొరత సమస్య ఉందని వైద్యులు శెట్టిబత్తుల శ్రీరామ రాజీవ్ కుమార్ వెల్లడించారు.