

ఎల్ బి నగర్. మన న్యూస్ తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్లో గుడిమెట్ల రజిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముప్పాళ్ళ నాగేశ్వరరావు ,(ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు) మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెనీ 1995లో ప్రారంభించబడిందని , తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ,కర్ణాటక,ఒరిస్సా రాష్ట్రాలలో దాదాపు 7వేల600 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లను పేద మధ్యతరగతి కుటుంబాల నుండి చేయించారని తిరిగి డిపాజిట్ దారులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చేసరికి అగ్రిగోల్డ్ మేనేజ్మెంట్ చేతులు ఎత్తివేసిందన్నారు. తెలంగాణలో దాదాపు మూడు లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం మాయలో పడి డబ్బును డిపాజిట్ చేసిన వారు కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి బాధలను వర్ణించలేమన్నారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమము పోరాటము తీవ్రతరం చేయడం ద్వారా గత ప్రభుత్వం 906 కోట్ల రూపాయలను బాధితులకు 20 వేల రూపాయల వరకు డిపాజిట్ చేసిన వారికి ఇవ్వటం జరిగిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పించడం జరిగిందన్నారు. తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయ పైసా కూడా దక్కలేదని చెప్పారు. తెలంగాణలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే పోరాటాలకు సిద్ధం కమ్మని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన పథకాలను ఏర్పాటు చేసి ముందుకు దూసుకు వెళ్తున్న యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంలో నికరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ బాధలను వివరిస్తూ ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి పోస్టు కార్డు ద్వారా ఉత్తరాలు రాయాలని కోరారు.ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్ బాధిత సంఘం ఉపప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు వేల సంఖ్యలో అగ్రిగోల్డ్ బాధితులను ఎట్లా సమీకృతులను చేసింది వారిని పోరాటానికి మళ్ళించిన పూర్తి వివరాలు వివరించారు. పశ్య పద్మ మాట్లాడుతూ 1956 కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన అగ్రిగోల్డ్ సంస్థ పేద మధ్యతరగతి ప్రజలను దారుణంగా మోసం చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బాధితులను ఆదుకోవాలి. పదుల సంవత్సరాలు గడిచినా బాధితుల కడగండ్లకు మోక్షం లేదని తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు.తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వి రావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల హక్కుల రక్షణ కోసం స్పెషల్ కోర్టును ఏలూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా తెలంగాణలో కూడా స్పెషల్ కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. రజిత గారు మాట్లాడుతూ ఉమ్మడి పది జిల్లాల్లో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశాలను నిర్వహించి జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవటానికి అందరము సిద్ధం కావాలని భవిష్యత్తులో రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యచరణను రూపొందించుకోవాలని అగ్రిగోల్డ్ బాధితులు అందరికీ మనవి చేశారు. కూనంనేనీ సాంబశివరావు గారిని రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా పశ్య పద్మ అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా గుడిమెట్ల రజిత, వజ్రాల అరుణ ప్రధాన కార్యదర్శిగా కల్లూరి జివి రావు ఉప ప్రధాన కార్యదర్శిగా ఎం శ్రీనివాసులు ట్రెజరర్ గా నవీన్ లను సమావేశం ఎన్నుకోవడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది.