

Mana News :- అమెరికా టారిఫ్లకు ప్రతి స్పందించేందుకు చైనా కూడా సిద్ధమైనట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఫెంటనిల్ ఎగుమతులకు ప్రతిగా తాము బీజింగ్పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు వాషింగ్టన్ గతంలో పేర్కొంది. దీనికి ప్రతిగా జిన్పింగ్ సర్కారు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు, టారిఫేతర చర్యలకు కూడా సిద్ధమైంది. చైనా టార్గెట్లో అమెరికా వ్యవసాయ, ఆహారోత్పత్తులు ఉండే అవకాశం ఉందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అమెరికా ఏకపక్షంగా వ్యవహరించి టారిఫ్లు, ఇతర చర్యలు చేపడితే.. బీజింగ్ బలంగా ప్రతిస్పందిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు గ్లోబల్ టైమ్స్ కథనంలో పేర్కొంది. గత గురువారం ట్రంప్ సోషల్మీడియా వేదికగా స్పందిస్తూ.. మెక్సికో, కెనడాపై మార్చి 4వ తేదీ నుంచి అదనపు సుంకాలు విధిస్తున్నామని వెల్లడించారు. అదే సమయంలో చైనాపై కూడా 10శాతం టారిఫ్లు అమల్లోకి వస్తాయని చెప్పారు. దీనిని జిన్పింగ్ కార్యవర్గంలోని పలువురు మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. బీజింగ్లోని వాణిజ్యశాఖ కార్యదర్శి స్పందిస్తూ.. ”చైనా మత్తుపదార్థాలను నిర్మూలించేందుకు విధానపరంగా, నిర్ణయాల అమలులో కఠినంగా ఉంటోంది. ఇందుకోసం అమెరికా సహా అన్ని దేశాలతో కలిసి పనిచేస్తోంది. అమెరికా తన తప్పును పునరావృతం చేయదని ఆశిస్తున్నాం. సంప్రదింపుల మార్గంలో అభిప్రాయభేదాలను పరిష్కరించుకొంటుందని ఆశిస్తున్నాం. అమెరికా తాను అనుకొన్న మార్గంలో వెళితే మాత్రం.. చైనా తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు తగినవిధంగా ప్రతిచర్యలు తీసుకొంటుంది” అని వెల్లడించారు. ‘టారిఫ్ ఒత్తిడిలు, బ్లాక్మెయిల్ కోసం ఫెంటనిల్ అంశాన్ని అమెరికా వాడుకుంటోంది. ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, ఒత్తిడి, నిర్బంధం, మాదకద్రవ్యాల నియంత్రణలో ఇరుదేశాల మధ్య చర్చలు, సంప్రదింపులకు ముప్పుగా మారుతుంది” అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాంగ్ పేర్కొన్నారు. అమెరికాతో ఏ వాణిజ్య విభేదాలు వచ్చినా.. బీజింగ్ ముందు ఆ దేశ వ్యవసాయరంగాన్ని లక్ష్యంగా చేసుకొంటుంది. 2018 వరకు అమెరికా వ్యవసాయోత్పత్తులకు చైనా అతిపెద్ద మార్కెట్గా ఉంది. అప్పట్లో బీజింగ్ సోయాబీన్, బీఫ్, పోర్క్, గోధుమ, మొక్కజొన్న వంటి వాటిపై 25శాతం సుంకాలు విధించింది. దీంతో మెల్లగా ఆ మార్కెట్పై అమెరికా పట్టు కోల్పోతూ వస్తోంది. ఇక 2024లో అమెరికా నుంచి 29.25 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను చైనా కొనుగోలు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 14శాతం తక్కువ.