Mana News :- తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం (EC)లకు నోటీసులు జారీచేసింది. మార్చి 22 లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారించగా.. ఈ సందర్భంగా జస్టిస్ బి.ఆర్. గవాయి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. “రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకు అనడమా? ప్రజాస్వామ్య విధానాలకు సరైన సమయం అవసరం. ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్, పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు” అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు, బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. ఆయన తన వాదనలో “గత ఏడాది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని.. ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరిగిందని తెలిపారు. అలాగే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రివర్స్ చేసిందని.. అది జరిగి ఏడాది పూర్తయిందని తెలుపుతూ, కేసు విచారణను కావాలని ఆలస్యం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో బీఆర్ఎస్ తరఫున వాదిస్తున్న సీనియర్ కౌన్సిల్ ఆర్యామా సుందరం అనర్హతపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం ఒక ఎత్తుగడగా మారిందని విమర్శించారు. న్యాయపరమైన సత్వర పరిష్కారం కోసం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులు, వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *