చిత్తూరు, మన ధ్యాస నవంబర్-24: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్టీయూ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఉద్యోగులకు మద్దతు ప్రకటిస్తూ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత లేకుండా, తక్కువ జీతాలతో, సరైన విధానాలు లేకుండా వేలాది మంది ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని తెలిపారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు
హెచ్ఆర్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలి.
మినిమం ఆఫ్ టైం స్కేల్ అమలు చేసి జీతాలను పెంపు చేయాలి.
ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.
రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలి.
ఈపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి ప్రయోజనాలు అందించాలి.
ఆరోగ్యభీమా, మెడికల్ సదుపాయాలు కల్పించాలి.
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
ఉపాధ్యాయ నియామకాలలో వారి అనుభవానికి అనుగుణంగా వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి. ఈ డిమాండ్లన్నీ వెంటనే అమలు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలని మదన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ధర్నాలో చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.