

నర్సంపేట, జూన్ 18:-ప్రైవేట్ పాఠశాలల్లో 2009 విద్యా హక్కు చట్టం (RTE Act) అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (AIFDS) తరఫున నర్సంపేట RDO ఉమారాణి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా AIFDS వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు మాట్లాడుతూ, కార్పొరేట్ విద్య పేరుతో ప్రైవేట్ పాఠశాలలు సామాన్య ప్రజలపై అధిక భారం మోపుతున్నాయని మండిపడ్డారు. అధిక ఫీజుల వసూలుపై నియంత్రణ విధించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం, ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం 25 శాతం సీట్లను నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని, అలాగే జర్నలిస్టుల పిల్లలకు కూడా ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే ఉచిత విద్యా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నూతన విద్యా విధానం (NEP)**పై స్పందించిన నాగరాజు, అది విద్యను ప్రైవేటీకరణ వైపు నడిపిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, డివిజన్ పరిధిలోని హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని కోరారు. “ఇవి తక్షణమే అమలు చేయకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం,” అని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AIFDS వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు కళ్ళేపెళ్లి రాకేష్, AIFDW వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు మార్త సుధ తదితరులు పాల్గొన్నారు.