మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సామాజిక, ఆర్ధిక రంగాల్లో ముందుకు రావడం ఎంతో అవసరం..

యాదమరి మన న్యూస్ మే 5: పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ టైలర్ గానూ మారారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి భరోసా కల్పించే ఉచిత కుట్టుమిషన్ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా, ఆయన స్వయంగా కుట్టుమిషన్ ముందు కూర్చుని వస్త్రం కుట్టి అందరిని ఆశ్చర్య పరిచారు. ఈ అరుదైన దృశ్యం సోమవారం ఉదయం యాదమరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్కి మండల నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఆయన. “నాయకత్వం మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి” అనే విషయాన్ని ఆయన స్పష్టంగా రుజువు చేశారు. ఈ శిక్షణా తరగతులకు యాదమరి మండలంలోని వివిధ గ్రామాల నుండి సుమారు 200 మంది మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ… “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం పెద్ద పీఠ వేస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ప్రతి గృహిణి కుటుంబాన్ని నడిపే శక్తిగా మాత్రమే కాదు, సమాజానికే ఉపాధి కల్పించే స్ధాయికి ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కుట్టు మిషను శిక్షణ తరగతులను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. 90 రోజుల పాటు మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరుగుతుందన్నారు. ఈ పధకం మహిళలకు ఉపాధి, ఆర్ధికంగా చేయూత అందించే ఒక గొప్ప అవకాశం, దీనిని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సామాజిక, ఆర్ధిక రంగాల్లో ముందుకు రావడం ఎంతో అవసరం అని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ రబ్బీ, టిడిపి నాయకులు అమరనాథ్ నాయుడు, చిట్టిబాబు మరియు మండల నాయకులు కార్యకర్తలు, అధికారులు, మహిళలు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *