

మన న్యూస్ , తిరుపతి:- స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు ఈరోజు ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం AISA జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం విద్యార్థి సంఘాలు కొనసాగిస్తున్న పోరాటాలపై ప్రభుత్వం దమనకాండను ప్రయోగించడం అప్రజాస్వామ్యమని, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు అన్నారు. 400 ఎకరాలను వేలం వేయడం ద్వారా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరుస్తూ వేల కోట్ల రూపాయలను దండుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తీవ్రంగా విమర్శించారు. హెచ్సీయూ భూముల జోలికి వెళ్లడం అంటే ప్రభుత్వం పతనాన్ని కోరుకోవడమే అవుతుందని తెలిపారు. ప్రభుత్వ భూముల్ని రక్షిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తీరు పచ్చి అవకాశవాదంగా ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఏడవ వాగ్దానంగా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తమ పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ భూములపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలని అణచివేస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (AISA), SFI, ఇతర విద్యార్థి సంఘాల అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు, ప్రజాతంత్ర శక్తులు ముక్తకండంతో ఖండించాలని ఆయన కోరారు. విద్యార్థినిల పట్ల పోలీస్ బలగాలు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని తెలిపారు. విద్యార్థులను అవమానకరంగా వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం కల్పించాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ వేణు, వంశీ కృష్ణవంశీ, మహేంద్ర, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
