ఉదయగిరి, ఫిబ్రవరి 11,మన న్యూస్,(నాగరాజు కె).
ఉదయగిరి నియోజకవర్గం లోని చారిత్రక ఖ్యాతి వహించిన సిద్దేశ్వరం దేవాలయానికి వెళ్లే రోడ్డు మరమ్మత్తు పనులు మంగళవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు, సీతారాంపురం తెలుగుదేశం పార్టీ నాయకుల పర్యవేక్షణలో ముమ్మరంగా సాగుతున్నాయి. సిద్దేశ్వరం మహాక్షేత్రములో మహాశివరాత్రి పండుగ సందర్భంగా మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు లక్షలాదిమంది భక్తులు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ ప్రాంతానికి విచ్చేస్తారు.ఇంత ప్రాధాన్యత ఉన్న దేవాలయానికి వెళ్లే మార్గం అటవీ ప్రాంతంలో ఉండడం, రోడ్డు గుంత లమయంతో నిండి ఉండడంతో, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మహదేవుని దర్శనాన్ని భక్తులు సులభంగా, సౌఖ్యంగా చేసుకోవాలని సత్సంకల్పంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రెండున్నర కిలోమీటర్ల పొడవునా ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.