

జూన్ 23, జోగులాంబ గద్వాల | మన న్యూస్ ప్రతినిధి
బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల భవిష్యత్తు ప్రమాదంలో పడనుందా? ఐజ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ట్యాంక్ నిర్మాణం పై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా గౌరవనీయ కలెక్టర్ గారికి ఓ ముక్త కంఠ వినతిపత్రాన్ని అందించారు. విద్యార్థులు చదువుకునే ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ నిర్మించడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు వివరంగా చర్చకు వస్తున్నాయి:
- పిల్లలకు ప్రమాదం జరగవచ్చు – చిన్నపిల్లలు ట్యాంక్ పైకి ఎక్కడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులు.
- మొక్కలు ధ్వంసం అవుతాయి – పాఠశాల గ్రీన్ కవర్ నశనం. స్కూల్ గ్రౌండ్ పూర్తిగా పాడవుతుంది.
- నిర్మాణం నడుస్తున్న సమయంలో తరగతులకు అంతరాయం.ట్యాంక్ నిండిన నీటి వల్ల దోమలు, ఈగలు వ్యాప్తి చెయ్యడం – ఆరోగ్య సమస్యలు.భవిష్యత్తులో ట్యాంక్ బలహీనమవడం వల్ల ప్రమాదం – అలంపూర్ నియోజకవర్గంలో ఇదే తరహాలో ఓ పాత ఘటన కూడా ఉదాహరణగా చెబుతున్నారు.
పాఠశాల అనేది కేవలం భవనం కాదు – గ్రామ ప్రజల ఆశ. లక్షల రూపాయలు వెచ్చించలేని పేద ప్రజల పిల్లల ఆశయం. ఈ నేపథ్యంలో స్కూల్ ప్రాంగణంలో ట్యాంక్ నిర్మించడం తప్పని, ఇతర ప్రాంతంలో నిర్మించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.విద్యార్థుల భద్రత కోసం, గ్రామ భవిష్యత్తు కోసం, సమాజం కోసం అధికారులు, నాయకులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ నిర్మాణంపై పునరాలోచించాలని గ్రామస్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.