

విద్యకే కూటమి ప్రభుత్వం పెద్దపీట
ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం
షైనింగ్ స్టార్స్ అవార్డులతో పేద విద్యార్థులకు ప్రోత్సాహం
సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి
మన న్యూస్ సింగరాయకొండ:-
విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు ప్రభుత్వ పాఠశాలలో గురువారం నాడు సాంఘిక మంత్రి సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ….. పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం సన్న బియ్యంతో అన్నం పెడతామని చెప్పి పేదల ఆశలకు సున్నం పెట్టారని దుయ్యబట్టారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచారన్నారు. విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పించారని కొనియాడారు. ప్రాథమిక పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకం అమలు చేశామన్నారు.షైనింగ్ స్టార్స్ అవార్డులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ 20వేల ప్రైజ్ మనీ తో ప్రోత్సహిస్తూ వారిలో సాధించాలనే పట్టుదలను పెంచుతున్నామని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
