

అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు రేషన్ సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం..
మన న్యూస్ తవణంపల్లె జూన్-1
పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, ముత్తరపల్లె గ్రామంలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ రేషన్ షాపు సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఆదివారం ముత్తరపల్లె గ్రామానికి చేరుకున్న *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళి మోహన్”* తవణంపల్లె మండల తహసీల్దారు సుధాకర్ మరియు మండల నాయకులు పుష్ప గుఛ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముత్తరపల్లె గ్రామంలో రేషన్ షాపులో సామాన్య ప్రజలకు బియ్యం పంపిణీ చేసారు. అనంతరం గ్రామంలో 65 ఏళ్ళు పైబడిన వృద్దులు, వికలాంగుల ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే స్వయంగా బియ్యం అందజేశారు. అనంతరం రేషన్ షాపులోని సరుకుల నిల్వ, తూకాల కొలతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విధానాలతో లబ్ధిదారులు వెళ్ళిన సమయానికి రేషన్ షాపు సరుకులు అందేవి కాదని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి ఎక్కడ ఆస్కారం లేకుండా ప్రతి లబ్ధిదారుడికి రేషన్ బియ్యం అందించాలనే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలు గుర్తించి పాత పద్దతిని అమలు చేస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకూ రేషన్ షాపుల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో రేషన్ అందించడం జరుగుతుందని, అదేవిధంగా 65 సంవత్సరాల పైబడిన వృద్దులకు, వికలాంగులకు ఇంటికి రేషన్ సరుకులు అందించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లె మండల తహసీల్దారు సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తవణంపల్లె మండల టిడిపి అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్, క్లస్టర్ ఇంఛార్జ్ మోహన్ నాయుడు, టిడిపి నాయకులు ప్రవీణ్ కుమార్ నాయడు, పట్నం గోపి, లవకుమార్ మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

