Mana News :- తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొనింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, మరి కొన్ని చోట్ల వడగళ్ల వాన పడుతుందన్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ఇచ్చింది. ఇక, రేపు (మార్చి 22) కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉండగా.. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతారవణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్లుండి (మార్చి 23) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మార్చి 24వ తేదీ నుంచి మళ్లీ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పుకొచ్చింది. అయితే, ఓవైపు ఎండలు.. మరోవైపు వర్ష సూచనతో తెలంగాణలో భిన్న వాతావరణం కనిపించనుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించిందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉత్తర కోస్తాలో ఈరోజు పొడి వాతావరణమే ఉండగా.. రేపు, ఎల్లుండి మాత్రం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరి కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *