

మన న్యూస్ తవణంపల్లె జూన్-26
మండలంలోని అరగొండలో గల అపోలో ఇషా విద్యాలయంలో చదువుతున్న వెంగంపల్లె కు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి నక్కల హేమభూషన్ రెడ్డి కుమార్తె నక్కల ఝాన్షి రెడ్డి పీఎం జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన 9వ తరగతి ప్రవేశ పరీక్షలో అద్భుత విజయాన్ని సాధించింది. తన దీర్ఘకాలిక కృషి, పట్టుదల, గురువుల మార్గదర్శకంతో ఈ విజయాన్ని అందుకున్న ఝాన్షి ప్రస్తుతం తన కుటుంబానికి, పాఠశాలకి గర్వకారణంగా నిలిచింది.
ఝాన్షి తండ్రి గారు ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి. క్రమశిక్షణ, అంకితభావం ఆమె కుటుంబ సంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. చదువులో ఎల్లప్పుడూ ప్రథమ స్థానంలో నిలిచే ఝాన్షి ఈసారి జిల్లా స్థాయి పోటీలోనూ తన ప్రతిభను చాటింది.
ఈ సందర్భంగా అపోలో ఇషా విద్యాలయ యాజమాన్యం, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు ఆమెను హృదయపూర్వకంగా అభినందించారు. “ఝాన్షి వంటి విద్యార్థులు మా పాఠశాల కీర్తిని పెంపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఆమె ఇంకా పెద్ద విజయాలను సాధించాలని ఆశిస్తున్నాం” అని స్కూల్ ప్రిన్సిపల్ మరియు సహచర ఉపాధ్యాయులు తెలిపారు. అలాగే వెంగంపల్లె గ్రామంలోని ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు తను ఇంకా బాగా చదివి పుట్టిన ఊరికి చదివిన పాఠశాలకు మంచి పేరు తీసుకు రావాలని దీవించారు.