

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 22: జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మునిసిపాలిటీలో మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (MAE)గా పని చేస్తున్న శ్రీ రాజశేఖర్ను విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో మే 20న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనచే సమర్పించబడిన వివరణలను పరిశీలించిన తరువాత, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ బీఎం. సంతోష్, IAS , జూన్ 20న ఆయన సస్పెన్షన్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.తెలంగాణ సివిల్ సర్వీసెస్ నియమావళి, 1991 ప్రకారం జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో, శ్రీ రాజశేఖర్ను వెంటనే విధుల్లో చేరి బాధ్యతలు నిబద్ధతతో నిర్వర్తించాలని ఆదేశించారు. సస్పెన్షన్లో గడిచిన కాలాన్ని సెలవులుగా పరిగణించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఈ ఉత్తర్వులకు అనుగుణంగా, ఐజా మునిసిపాలిటీలో ఆయన తిరిగి విధుల్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో మునిసిపాలిటీలో అభివృద్ధి పనులు మరింత చురుగ్గా సాగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు.