

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాధకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని డిఎస్పీ బుచ్చయ్య పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పరిధిలోని మరికల్ మండల కేంద్రంలోని ప్రతిభ హై స్కూల్, మణికంఠ జూనియర్ కళాశాల విద్యార్థులకు తెలంగాణ యాంటీ నార్కో ట్రిక్స్ బ్యూరో డి ఎస్ పి ఎన్ బుచ్చయ్య, మరికల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం జూన్ 26 వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాంటీ నర్కో ట్రిక్స్ బ్యూరో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ డిఎస్పి ఎన్ బుచ్చయ్య మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిరోధానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుందని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి వాటిని నివారించాలని, డ్రగ్స్ విక్రయ దారులు యువతనే లక్ష్యంగా చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తారని, దీనిపై యువత చైతన్యం కలిగి ఉండాలన్నారు. మన పరిసరాలలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిస్తే సామాజిక బాధ్యతగా పోలీసు అధికారులకు టీ జీ ఏ ఎన్ బి టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా 87126711111 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. డ్రగ్స్ వినియోగిస్తే ఎలాంటి ప్రభావాలు చూపుతాయి వాటి వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయని వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మరికల్ సీ ఐ రాజేందర్ రెడ్డి, ఎస్సై రాము విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మరికల్ పోలీసులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు లెక్చరర్స్ తదితరులు పాల్గొన్నారు.