

మనుబోలు, నెల్లూరు జిల్లా , మన న్యూస్: తిరుపతి జిల్లాలోని మనుబోలు మండలం లో జరిగిన లోటస్ వ్యాలీ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన కుటుంబ సమేతంగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “చిన్నారుల స్కూలు ప్రారంభోత్సవానికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి బిడ్డ భవితవ్యాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు,” అని అన్నారు.ప్రభుత్వ స్కూళ్లలో మోడల్ స్కూల్ విధానం అమలు, తల్లికి వందనం పథకం లాంటి నిర్ణయాలు విద్యలో నాణ్యతను పెంపొందించనున్నాయని తెలిపారు. “త్వరలో ప్రతి బిడ్డకు రూ.15 వేల రూపాయల సహాయం అందించే పథకం అమలులోకి రానుంది,” అని పేర్కొన్నారు.
*అభివృద్ధిపై దృష్టి – క్రీడా మైదానం, డ్రైనేజీ, వసతి గృహం* రాజగోపాల్ రెడ్డి తన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడించారు: మనుబోలు స్కూల్ ఆవరణలో స్టేడియం నిర్మాణం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో యూత్ క్లబ్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం బాధాకరమని, తిరిగి అందరికీ ఉపయోగపడేలా మారుస్తామని స్పష్టం చేశారు. శాప్ చైర్మన్ రవినాయుడును ఆహ్వానించి ఆధునిక స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాన్ని కూల్చి, కొత్తదిగా నిర్మించే యోచన ఉందన్నారు.
మనుబోలు డ్రైనేజీ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వ సహకారంతో ముందడుగు వేస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ వ్యాఖ్యలు: “వైసీపీ హయాంలో అభివృద్ధికి బదులు అక్రమార్జనకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోంది,” అని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


