

రేషన్ బియ్యం పంపిణీలో పాత విధానం ద్వారా పేదలకు ఊరట..
రేషన్ దుకాణాల్లో బియ్యం అందుకోవడం పేదవాడి హక్కు..
మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-1 పూతలపట్టు నియోజకవర్గంలో రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ పండుగలా ప్రారంభమైంది. ఆదివారం పూతలపట్టు మండల కేంద్రంలోని రేషన్ షాపులో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ రేషన్ షాపు సరుకుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేసిన ఆయన, వికలాంగులు, వృద్దులకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలుపై వృద్దులు, వికలాంగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వ విధానాల వల్ల రేషన్ బియ్యం పంపిణీలో పేదలకు తీరని ఇబ్బందులు ఎదురయ్యాయని విమర్శించారు. ఎండియూ వాహనాల ద్వారా రాజకీయంగా లబ్ధి చేకూరదని, వంద రూపాయల బియ్యం కోసం ఐదు వందల రూపాయల కూలీని పోగొట్టుకునే పరిస్ధితిని తలెత్తింది అని ఆయన పేర్కొన్నారు. విఆర్వోలు లాగిన్ చేసే వరకూ రేషన్ ద్వారా సరుకులు పంపిణీ జరిగేది కాదన్నారు. దీని ద్వారా అధికారులకు, వాహన యజమానులకు, వాహన డీలర్స్ కు సమన్వయం లోపించడంతో పాటు గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్ధితి ఏర్పడేదన్నారు. రేషన్ దుకాణాల్లో సరుకులు పాత విధానం ద్వారా గౌరవం ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పాత విధానంను అమలు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఇది అధికారులకు భారం తగ్గించి సులభతరంగా ప్రజలు రేషన్ షాపుల్లో సరుకులు పొందే అవకాశం దక్కిందన్నారు. వృద్దులకు, వికలాంగులు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే పద్దతిని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగిందన్నారు. ప్రతి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకూ రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ జరుగుతుందని, ఉదయం సాయంత్రం రేషన్ డీలర్స్ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. అంతే కాకుండా పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీలో గత పద్దతులను అవలంబించడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతుందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు తహసీల్దారు రమేష్ బాబు, సీఐ కృష్ణమోహన్, చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి గంగారపు గోపి, పూతలపట్టు మండల టిడిపి అధ్యక్షులు దొరబాబు చౌదరి, మాజీ మండల అధ్యక్షులు చంద్రమౌళి, నాయకులు గుంటూరు మురళీ నాయుడు, హిమగిరి నాయుడు, సురేంద్ర నాయుడు, ఇంద్రసేన నాయుడు, చిరంజీవి నాయుడు మరియు కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గోన్నారు.
