

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండల తహసిల్దార్ కార్యాలయంలో 30-05-2025న గ్రామ రెవిన్యూ అధికారులు, వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకుల సమక్షంలో కౌలుదారు కార్డుల జారీపై సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మండల తహసిల్దార్ టి. రవి మాట్లాడుతూ, కౌలుదారు చట్టంలోని విధి విధానాల ప్రకారం గ్రామ వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకులు తమ గ్రామాల్లో సొంత భూమిలేని కౌలురైతులను గుర్తించి, వారి వివరాలను గ్రామ రెవెన్యూ అధికారులకు అందజేయాలని సూచించారు.అదేవిధంగా, మండల వ్యవసాయ అధికారి వి. సుధాకర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో వాస్తవ కౌలురైతులను గుర్తించి వారికి మాత్రమే కౌలురైతు గుర్తింపు కార్డులు జారీ చేయాలని అధికారులు కోరారు. భవిష్యత్తులో సాగుదారు హక్కు పత్రం (CCRC) ఉన్న రైతులకు మాత్రమే పంట నమోదు, అన్నదాత సుఖీభవ, విత్తనాల పంపిణీ, సూక్ష్మ పోషకాల పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని వివరించారు.ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన సహాయకులు గ్రామ నాయకులతో కలిసి సాగుదారు హక్కు పత్రంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వాస్తవ సాగుదారులకు హక్కు పత్రాలు జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకులు పాల్గొన్నారు.