

తిరుపతి,మన న్యూస్ , మే 30 :– కడపలో మూడు రోజులపాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతమైందని, పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు, టిటిడి పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారామ్ తెలిపారు. తిరుపతిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రోజులపాటు జరిగిన మహానాడు కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసి విజయవంతం చేసిన నాయి బ్రాహ్మణ సోదరులందరికీ పాదాభివందనాలు తెలిపారు. మూడు రోజులపాటు కడపలో జరిగిన మహానాడుతో జిల్లా అంతా పసుపు మయం అయిందని, ప్రపంచంలోని తెలుగు వారంతా గర్వపడేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడులో నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారందరికీ న్యాయం జరగడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారన్నారు. నారా లోకేష్ చేసిన యువ గళం పాదయాత్ర ద్వారా ఎన్నో సమస్యలను లోకేష్ స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కార దిశగా చొరవ చూపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులకు అన్ని దేవాలయ పాలకమండలిలలో చోటు కల్పించే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల మనమంతా చంద్రబాబు, నారా లోకేష్ లతోపాటు పార్టీకి ఎప్పుడు విధేయతతో ముందుకు కొనసాగాలని టీటీడీ పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం నాయి బ్రాహ్మణ సోదరి సోదరీమణులందరికీ సూచించారు.