

Mana News, Mana Sports :- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబయి వేదికగా జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు భారత్కు 265 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టుకు భారత్ బౌలర్ మొహమ్మద్ షమీ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక్క పరుగూ చేయని కూపర్, షమీ బౌలింగ్లో కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, మరో ఎండ్లో ట్రావిస్ హెడ్ బౌండరీలతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. స్మిత్ అర్ధ సెంచరీ :- అయితే, ఆ తర్వాత బౌలింగ్కు వచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 39 పరుగులు చేసిన ట్రావిస్ను ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ 54 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత స్మిత్, లబుషేన్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. వీరిద్దరు కలిసి ఆసీస్కు 56 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే, ఇన్నింగ్స్ 23వ ఓవర్లో లబుషేన్(29)ను, 27 ఓవర్లో ఇంగ్లిష్ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 73 పరుగులు చేసిన స్మిత్ను షమీ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్వెల్ (7) కూడా వెంటనే ఔటవడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత అలెక్స్ క్యారీ (57 బంతుల్లో 61 పరుగులు) రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లో 264 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు, జడేజా, వరుణ్ రెండేసీ వికెట్లు తీశారు. న్యూజీలాండ్తో ఆడిన జట్టుతోనే భారత్ సెమీఫైనల్లో దిగింది. ఆసీస్ మాత్రం రెండు మార్పులు చేసింది. మ్యాట్ షార్ట్ స్థానంలో కూపర్, జాన్సన్ స్థానంలో స్పిన్నర్ తన్వీర్ సంఘా జట్టులోకి వచ్చారు. ఇండియా, ఆసీస్ జట్లు ,భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), కూపర్ కోనోలీ, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్వెల్, బెన్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.