

చిత్తూరు మన ధ్యాస సెప్టెంబర్-13: ఈరోజు ఉదయం 10 గంటలకు ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “ఉపాధ్యాయులందరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్” జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి కృషి చేయాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన పద్ధతులు పాటించి విద్యార్థులను తీర్చిదిద్దాలి” అని పేర్కొన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ మాట్లాడుతూ, “డాక్టర్ రాధాకృష్ణన్ మైసూరు, బెనారస్ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా, ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అతిథి ఉపన్యాసకుడిగా సేవలందించారు. దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా విశిష్టమైన సేవలు అందించారు. ఆయన జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయులందరికీ గర్వకారణం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నౌషాద్ అలీ, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, కమలాపతి, మీనాక్షి, ప్రసన్న కుమారి, ప్రసన్న లక్ష్మి, ఆనందయ్యలకు సత్కారం అందజేశారు. అలాగే విశ్రాంత ఉపాధ్యాయులు త్యాగరాజులు నాయుడు, అమర్నాథ్ రెడ్డి, వాసు, గంగాధరం, గుణశేఖరన్, బాలచంద్రారెడ్డితో పాటు సీనియర్ ఉపాధ్యాయులు జార్జ్, ప్రమీల కుమారి, సుల్తాన్, సల్మా, రామకృష్ణ, భాషా, లక్ష్మీపతి, గణపతి, ఉమాపతి, విజయ్ కుమార్ తదితర 25 మందిని ఘనంగా దుశ్శలువ వేసి సత్కరించి, బహుమతులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల గౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకలు విశేషంగా నిలిచాయి.