

Mana News , హైదరాబాద్: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, పలువురు పార్టీ నేతలతో కలిసి ఈ పథకాన్ని సీఎం ప్రారంభించారు.సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే 54 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం అన్నారు. తొలి ఏడాదిలోనే ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మరొకటి లేదన్నారు. రాష్ట్రంలో 50లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. త్వరలోనే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 65 లక్షల మంది మహిళలకు 1.20 కోట్ల నాణ్యమైన చీరలు పంపిణీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం భారీగా అవినీతి, దుబారాకు పాల్పడింది..:- ”దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో ఇప్పటివరకూ కులగణన జరగలేదు. సమాజానికి ఎక్స్ రే వంటి కులగణన దేశమంతా జరగాలని రాహుల్ గాంధీ చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టాం. ఎస్సీల వర్గీకరణ కోసం 35 ఏళ్లుగా ఉద్యమం సాగుతోంది. దశాబ్దాలుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణపై కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాం. అబద్ధాల పునాదుల మీద మేము ప్రభుత్వాన్ని నడపలేం. గత ప్రభుత్వం భారీగా అవినీతి, దుబారాకు పాల్పడింది. దుబారా ఖర్చులను తగ్గించుకుంటూ అప్పులు చెల్లిస్తున్నాం. ఒక్క ఇసుక విక్రయంలోనే రోజువారీ ఆదాయం రూ.3 కోట్లు పెరిగింది. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లలో 17 శాతం పెరుగుదల నమోదైంది. ధరల పెరుగుదలను నియంత్రించడంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా ఉంది. మంత్రివర్గం నుంచి మంత్రులను తొలగిస్తేనే.. పట్టు ఉన్నట్టా? :- నాకు పరిపాలనపై పట్టు రాలేదని కొందరు అంటున్నారు. మంత్రివర్గం నుంచి మంత్రులను తొలగిస్తేనే.. పట్టు ఉన్నట్టా? అధికారులను తొలగించి, బదిలీలు చేస్తేనే పాలనపై పట్టు సాధించినట్లు అవుతుందా?ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని మా ఎమ్మెల్యేలకు.. అసలైన అర్హులకు పథకాలు తప్పకుండా వర్తింపజేయాలని అధికారులకు చెబుతున్నాను. అన్నింటినీ సవ్యంగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లడమే నా విధానం. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించడమే మా లక్ష్యం” అని సీఎం అన్నారు. స్వయం ఉపాధిపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క :- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ”ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే స్వయం ఉపాధి కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. యువ వికాసం పథకాన్ని ఉపయోగించుకొని యువత ఉపాధి కల్పించుకోవాలి. ఉద్యోగాలు లభించక గ్రామీణ యువత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. యువ వికాసం పథకాన్ని గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలి. ఏడాది వ్యవధిలోనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ఇచ్చాం. రాష్ట్రంలో ఒకప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నాలు జరిగేవి. ఇప్పుడు నోటిఫికేషన్ల మధ్య కొంత గ్యాప్ ఇవ్వాలని ధర్నాలు జరిగే రోజులొచ్చాయి. యువతకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కల్పనతో పాటు స్వయం ఉపాధిపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది” అని భట్టి అన్నారు. ‘రాజీవ్ యువ వికాసం’ .. ఎవరి కోసం.. ఎందుకు? :- ‘రాజీవ్ యువ వికాసం’ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. యువ వికాసానికి ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. కేటగిరీ-3 కింద రూ.3 లక్షల వరకు సాయం.. 60 శాతం రాయితీ ఇవ్వనుంది. కేటగిరి-1 కింద రూ.లక్ష వరకు రుణం.. 80 శాతం రాయితీ. కేటగిరీ-2 కింద రూ.2 లక్షల వరకు సాయం.. 70 శాతం రాయితీ కేటగిరీ-3 కింద రూ.3 లక్షల వరకు సాయం.. 60 శాతం రాయితీ ఇవ్వనుంది.
