

పిల్లలు భవిష్యత్తు కోసం ప్రవర్తన తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్ ఐపీఎస్ గారు
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ఉన్నత లక్ష్యాలు సాధించేలా తమ వంతు కృషి చెయ్యాలి
మెగా పేరెంట్స్ & టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గారు
మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ, గురుకులం బాలికల పాఠశాల & జూనియర్ కాలేజీ నందు గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ & టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారు విద్యార్థినిలకు గుడ్ & బ్యాడ్ టచ్, మాదక ద్రవ్యాల వలన జరిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ పై మరియు మహిళలు బాగా కష్టపడి ఉన్నత స్ధాయికి ఏవిధంగా ఎదిగారో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించారు.
ఈ ఆత్మీయ సమావేశంలో జిల్లా ఎస్పీ గారు విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కొరకు దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, ఇతర విద్యార్థుల పట్ల, ఆడపిల్లల పట్ల, సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. ఆడపిల్లలు తమ తల్లిదండ్రులను తప్ప వేరే ఎవరిని నమ్మి మోసపోరాదని, సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన పెంచుకుని నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. బాలికలు ధైర్యంగా ఉండాలని ఏదైనా సమస్య వచ్చిన తల్లిదండ్రులకు చెప్పాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. మహిళలు చాలా శక్తివంతులని క్రమశిక్షణగా చదువుకోవాలని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడా నైపుణ్యాలు పెంచుకొని శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించుటకు అవిశ్రాంతముగా కృషి చేయాలని విద్యార్థుల్లో స్ఫూర్తి రగిలించారు. ఫోన్లో అనవసరమైన/తెలియని వాటి జోలికి వెళ్ళరాదని, సైబర్ నేరాల పట్ల విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణగా మెలిగి, బాగా చదువుకోవాలని ఉన్నత స్థాయికి చేరుకోని జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. వారి కుటుంబసభ్యులు బైక్ మీద వెళ్లేటప్పుడు రహదారి భద్రత నియమాలు పాటిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమని చెప్పాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల మార్కుల కోసం వెంపర్లాడకుండా వారి క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు చెప్పారు. మైనర్లు వాహనాల డ్రైవింగ్ చేస్తూ చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి వారిని జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిలుపుదల చేసి, వారి బంగారు భవిష్యత్తు పాడవకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను ఉపాధ్యాయులు గుర్తించి వారికి ఉన్నత లక్ష్యాలు నిర్దేశించి, వాటిని అందుకోవడానికి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించాలని సూచించారు.
మైనర్ బాలికలు/మహిళలు వయసుతో నిమిత్తం లేకుండా మానవ మృగాళ్ల బారిన పడి బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి రక్షణ కొరకు ప్రకాశం జిల్లా పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారని, ఆడపిల్లలపై అఘాయిత్యాలు పునరావృతం కాకుండా, పాఠశాలలు/కళాశాలలో పోలీసు అధికారులు వెళ్లి గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ ఆకర్షణ ప్రేమ ప్రభావాలు, చీటింగ్, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్ స్వీయ రక్షణ లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. శిక్షించడం మాత్రమే లక్ష్యం కారాదని, మైనర్లలో నేర ప్రవృత్తిని తగ్గించడానికి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రకాశం జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారని చెప్పారు. ఆడపిల్లలు, మరియు స్త్రీలకు సంబంధించిన సమస్యల పట్ల ప్రకాశం జిల్లా పోలీసులు, అత్యంత తొందరగా, చురుకుగా స్పందించి వారిని రక్షించిన సందర్భాలను ఎస్పీ గారు సోదాహరణంగా వివరించారు.
గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల అమ్మకం ,రవాణా ,వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు మరియు స్ధానిక పోలీస్ లకు తెలియజేయాలని, అట్టివారు వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఐటి కోర్ సీఐ సూర్యనారాయణ, టంగుటూరు ఎస్సై నాగమలేశ్వరావు, స్కూల్ ప్రిన్సిపాల్ రమాదేవి, విద్యార్థులు తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.
