

మన న్యూస్,నారాయణ పేట జిల్లా: మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా మక్తల్ విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాల మహమ్మారికి దూరంగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తు కొరకు బాటలు వేసుకోవాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ పిలుపునిచ్చారు.మంగళవారం రోజు నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని బాయ్స్, అంబేద్కర్ నగర్ (ఐలిన్) స్కూల్ లో ఏర్పాటు చేసిన మత్తు పదార్థాల నిర్మూలన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ మీ జీవితానికి అత్యంత కీలకమైన పునాది. ఈ సమయంలో తెలియని ఆకర్షణలకు లోనై డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారమయమవుతుంది .ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని, మీ కలలను కూడా నాశనం చేస్తుందన్నారు. పోలీసులు మీ శ్రేయోభిలాషులు. ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ చాలా కఠినమైనది, ఒకసారి ఈ కేసులో చిక్కుకుంటే జీవితాంతం దాని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి, మీరంతా చైతన్యవంతులై, మీ స్నేహితులను కూడా ఈ వ్యసనం వైపు వెళ్లకుండా కాపాడాలి అని హితవు పలికారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా, గంజాయి దుష్ప్రభావాలను వివరించి అవగాహన కల్పించారు. విద్యార్థులు స్కూలు కాలేజీల వద్ద చాక్లెట్ రూపంలో మత్తు పదార్థాలను అమ్ముతున్నారని అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని, ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల చైతన్యం, సహకారంతోనే మత్తు పదార్థాలైన డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిర్మూలించగలమని, తద్వారా నేరరహిత సమాజాన్ని స్థాపించగలమని ఆయన గట్టిగా విశ్వాసం వ్యక్తం చేశారు. డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే విద్యార్థులు 1908 టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని ఎస్పీ గారు తెలిపారు.ఈ కార్యక్రమాలలో మక్తల్ సీఐ రామ్ లాల్, ఎక్సైజ్ సీఐ అశోక్ కుమార్, ఎస్ ఐ భాగ్య లక్ష్మీ రెడ్డి, అశోక్ బాబు, డి వై ఎస్ ఓ వెంకటేష్, ఎమ్ ఈ ఓ అనిల్ గౌడ్, ప్రిన్స్ పాల్ రాములు, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.