

మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. దామోదర్ ఐపీఎస్ గారు ఆదివారం ఉదయం సింగరాయకొండ సర్కిల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ, గదులు, రిసెప్షన్ కౌంటర్, రికార్డులు, మరియు పరిశుభ్రత పరిస్థితులపై మినితీ వివరాలు తెలుసుకున్నారు.ఎస్పీ గారు స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా మహిళల సమస్యలు, చిన్నారుల ఫిర్యాదులు మొదలైన అంశాలపై ప్రత్యేక దృష్టి అవసరమని పేర్కొన్నారు. విచారణలో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, పాత నేరస్తులపై నిఘా, గ్రామాల్లో తరచూ పర్యటించడముతో ప్రజల భద్రతను మెరుగుపరచాలని సూచించారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేయాలని, గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించాలని తెలిపారు.సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల ప్రమాదాలు, హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే సూచనలు ఇచ్చారు. స్టేషన్లో పనిచేసే సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నదని తెలిపారు.పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి పౌరునితో మర్యాదగా, కుటుంబ సభ్యులవలె మాట్లాడాలని, వారి సమస్యలకు పరిష్కారం చూపించడంలో పోలీసులు అందుబాటులో ఉండాలని సూచించారు. విధుల పట్ల నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు.ఈ తనిఖీలో ఎస్పీ గారితో పాటు ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ హాజరత్తయ్య, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎస్సై మహేంద్ర మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
