

మన న్యూస్ సింగరాయకొండ:-
రైతుల హక్కుల కోసం కొనసాగుతున్న రైతు పోరుబాట కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు మాజీ మంత్రి, పి.ఏ.సీ సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఆదిమూలపు సురేష్ పిలుపు ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన పొదిలిలో జరిగే పోరుబాట కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఆదివారం సింగరాయకొండలోని కొండేపి నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడారు. ప్రభుత్వ ఆంక్షలు, నిర్బంధాలు వచ్చినా రైతుల పోరాటం ఆగదని, పోరుబాట విజయవంతం చేయడం శ్రేణుల బాధ్యతగా పేర్కొన్నారు.పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని, కార్పొరేట్ కంపెనీలు, దళారుల పక్షాన వ్యవహరిస్తూ రైతులను దుర్గతికి నెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నేనూరుపాడు గ్రామానికి చెందిన రైతు చల్లా మధుసూదన రెడ్డి ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటనను ఉదాహరణగా చూపిస్తూ, ఇకనైనా ప్రభుత్వం రైతుల పక్షాన నిలవాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటే చలో పొదిలి కార్యక్రమంలో ప్రతి కార్యకర్త, రైతు పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీకి చెందిన 6 మండలాల నాయకులు పాల్గొన్నారు.