

తిరుపతి, మన న్యూస్ , జూన్ 2:- వే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ పైడి అంకయ్య ఆధ్వర్యంలో తిరుపతి మహానగరంలో ఘనంగా నిర్వహించిన “జయహో జానపదం – వరల్డ్ విన్నర్” సన్మాన కార్యక్రమంలో తిరుచానూరు కు చెందిన ప్రముఖ రచయిత, యువకవి నందిపాక అంజనాద్రి “వరల్డ్ విన్నర్” ప్రశంసా జ్ఞాపికను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “సాహిత్యరంగంలో నాకు లభించిన ఈ గౌరవం ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రజల భాషను, భావోద్వేగాలను అక్షరాల్లో బంధించడమే నా రచనా లక్ష్యం. ఇలాంటి గౌరవం నా భవిష్యత్ రచనలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ అవకాశాన్ని కల్పించిన వే ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పైడి అంకయ్య కి హృదయపూర్వక కృతజ్ఞతలు,” అన్నారు.
కార్యక్రమంలో పలువురు కళాకారులు, రచయితలు, ప్రముఖులు పాల్గొన్నారు. జానపద కళల్ని ప్రోత్సహించడంలో వే ఫౌండేషన్ ముందున్న సంస్థగా పేరుపొందుతోంది. “జయహో జానపదం” అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం అనేకమంది స్థానిక ప్రతిభావంతులకు వేదికగా నిలిచింది. కవిత్వం, జానపద సాహిత్యంపై అంజనాద్రి చూపిస్తున్న నిబద్ధత, అభినవ ప్రయత్నాలకు ఇది గుర్తింపుగా నిలుస్తుందని సాహితీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
