Mana News, శ్రీకాళహస్తి:- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆలోచనల్లో క్రూరత్వం ఎక్కువ అని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు ఆరోపించారు. శాసనసభ చట్టాల ప్రకారం ప్రతిపక్ష హోదాకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా పొందే అర్హత లేదని స్పష్టంగా చెప్పినా వినక అనవసర రాద్దాంతం చేస్తున్న జగనన్నకు పులివెందుల ఎమ్మెల్యే పదవే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. అత్యంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ని ఉద్దేశిస్తూ జగన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ, నిందారోపణలతో లేఖ రాయడం జగన్ యొక్క అహంకార పూరితమైన ధోరణిని తెలియజేస్తున్నదని ఆరోపించారు. భారత రాజ్యాంగం నిర్దేశించిన చట్టాలకు వ్యతిరేకంగా గత ఐదేళ్ళూ అరాచక పరిపాలన అందించి నరకం అంటే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యక్షంగా రుచి చూపించిన జగన్ రెడ్డి తన రాజ్యాంగాన్ని తానే సృష్టించుకునే స్థాయికి దిగజారుతున్నాడని ఎద్దేవా చేశారు. అహంకారానికి ప్యాంటు,షర్టు వేస్తే అచ్చం జగన్ లాగే ఉంటుందని,జగన్ మానసిక తీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కలవకపోవడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి రాకపోవడం సహజం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్ళూరు బుజ్జి, బిసి విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *