Mana News :- తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. రెండు చోట్ల ఫలితం తేలిపోయింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ల ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ నేత శ్రీపాల్ రెడ్డి గెలవగా.కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ బలపర్చిన మల్క కొమరయ్య విజయం సాధించారు. ఇక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తుది ఫలితం రావడానికి అర్థరాత్రి అయ్యే అవకాశం ఉంది. పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టారనేది ఉత్కంఠ రేపుతోంది. బ్యాలెట్ పేపర్లు కట్టే సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు చూడగా మొదటి ప్రాధాన్యత ఓట్లు బీజేపీ అభ్యర్థికి ఎక్కువ పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు అంజిరెడ్డికి ఎక్కువ పడ్డాయని, ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉంటారని, మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఉండే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. తొలి ప్రాధాన్యత ఓటులో ఏ అభ్యర్థి కోటా ఓట్లు సాధించే అవకాశం లేదని, ఈక్రమంలో రెండో ప్రాధాన్యత ఓటు కీలకం కానుందనే చర్చ జరుగుతోంది.ముగ్గురి మధ్య..:- కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. పోలింగ్ పూర్తైన తర్వాత బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుస్తారని చాలామంది అంచనా వేశారు. బ్యాలెట్ బాక్కులు తెరిచిచూస్తే మాత్రం ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి పడినట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారికి విజయవకాశాలు ఎక్కువుగా ఉండే ఛాన్స్ ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ప్రసన్న హరికృష్ణ మూడోస్థానంలో ఉంటే.. ఆయన ఎలిమినేషన్ ద్వారానే విజేత తేలే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరైనా రెండు, మూడు స్థానాల్లో ఉంటే మూడో స్థానంలో ఉన్న అభ్యర్థి ఎలిమినేషన్ ద్వారా విజేత తేలే అవకాశం ఉంటుంది. ఊహించని ఫలితం :- కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ ఉంటుందని భావించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి గణనీయంగా ఓట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మూడో స్థానంలో ఉండవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీఉందని ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరైనా గలియే అవకాశాలు ఉన్నట్లు తెలిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *