

మన న్యూస్ :- మరో 18 రోజుల్లో ఐపీఎల్ 18వ ఎడిషన్ (IPL 2025) పోటీలు ప్రారంభం కానున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లోపే క్రికెట్ అభిమానులను సందడి చేయనుంది.కోల్కతా నైట్రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ మినహా మిగతా జట్లకు సారథి ఎవరనేది తేలిపోయింది. దిల్లీ మాత్రం కేఎల్ లేదా అక్షర్ పటేల్లో ఒకరిని కెప్టెన్గా నియమించే అవకాశం లేకపోలేదు. మరోవైపు కేకేఆర్ మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈక్రమంలో తమ జట్టు కొత్త జెర్సీని కోల్కతా(Kolkata Knight Riders) ఆవిష్కరించింది. జెర్సీపై మూడు స్టార్లకు చోటు కల్పించింది. ఈమేరకు సోషల్మీడియాలో స్పెషల్ వీడియోను కేకేఆర్ పోస్టు చేసింది.”జెర్సీ మీద మేం మూడు స్టార్లకు స్థానం కల్పించాం. కేకేఆర్ మూడు టైటిళ్లను సొంతం చేసుకుంది. మే 27, 2012, జూన్ 1, 2014, మే 26, 2024న మేం విజేతలుగా నిలిచాం. మిథున రాశి రోజునే ఇవన్నీ జరిగాయి. చివరిగా వచ్చిన మూడో స్టార్ మమ్మల్ని మళ్లీ అగ్రస్థానానికి చేర్చింది. ఈసారి కూడా అదే ఉత్సాహం ప్రదర్శిస్తాం. మూడు టైటిళ్లకు కర్బో, లోర్బో, జీత్బో అని నామకరణం చేశాం. బెంగాలీ పదాలైన వీటికి ప్రదర్శన, పోరాటం, గెలుపు అని అర్థం. ఇది కేవలం మా ఉద్దేశం మాత్రమే కాకుండా.. ఛాంపియన్ వారసత్వాన్ని కొనసాగించేందుకు స్ఫూర్తిగా నిలుస్తాయి” అని కేకేఆర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ బిందా దే వెల్లడించారు.కెప్టెన్ ఎవరో..?:- డిఫెండింగ్ ఛాంపియన్కు సారథి ఎవరనేది చిక్కు ప్రశ్నగా మారింది. గత ఐపీఎల్ టైటిల్ను అందించిన శ్రేయస్ అయ్యర్ను మేనేజ్మెంట్ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలోనూ తీసుకోలేదు. యువ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్కు భారీ మొత్తం వెచ్చించింది. అనూహ్యంగా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానెను తీసుకుంది. రింకు సింగ్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. కానీ, వెంకటేశ్ లేదా రహానెలో ఒకరికి సారథ్యం అప్పగించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. కొత్త సీజన్కు మరిన్ని రోజులు కూడా లేకపోవడంతో కేకేఆర్ నిర్ణయం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.