మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: నారాయణపేట జిల్లా కోస్గి, గుండుమల్, మద్దూర్, కొత్తపల్లి మండలాల పరిధిలో జరుగుతున్న గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు ప్రజలకు సహాయం చేస్తూ పోలీసులు తమ సేవలను మరింత విస్తరించారు.ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వృద్ధ, వికలాంగ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కర్రలు పట్టుకుని నెమ్మదిగా వచ్చేవారికి చేయి పట్టుకొని సహాయం చేయడం, వీల్చైర్పై వచ్చిన వికలాంగులను బూత్ వరకు తీసుకెళ్లడం, నీళ్లు అందించడం, క్యూలో నిలబడలేని వారికి ముందుగా సహాయం చేసేలా మార్గనిర్దేశం చేయడం వంటి సేవాభావంతో విధులు నిర్వహిస్తున్నారు.జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు సిబ్బంది చురుకుగా వ్యవహరిస్తూ, శాంతియుత మరియు నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నారు. ఎన్నికల విధుల్లో పాటించాల్సిన కోడ్ ఆఫ్ కండక్ట్ను పూర్తి స్థాయిలో పాటిస్తూ, ప్రజలు ఎటువంటి భయం లేదా ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు చేపట్టారు.వృద్ధులు, వికలాంగులకు పోలీసుల ఈ సేవలు స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఎన్నికల రోజున బందోబస్తుతో పాటు మానవతా సేవలందించడం ద్వారా పోలీసులు ప్రజలకు చేరువైన సేవాస్ఫూర్తిని మరొకసారి చాటిచెప్పారు.






