

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి గద్వాలలోని జూరాల ప్రాజెక్టును సందర్శించిన క్రమంలో… జిల్లాలోని సాగునీటి సమస్యలను రైతుల తరఫున వివరిస్తూ ఎమ్మెల్యే విజేయుడు మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఆర్డిఎస్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఆయన కోరారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో ప్రధానంగా రైతులకు ఆయువుగా భావించే మల్లమ్మ కుంట, వల్లూరు, జూలకల్లు రిజర్వాయర్లను పూర్తిచేసి ఆర్డీఎస్ ఆయకట్టులో డిస్ట్రిబ్యూటర్ వరకు నీరు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిన్నోని పల్లె నుండి ఆర్డీఎస్ కు లింకు కలిపి ఆయకట్టుకు మరింత జీవం అందించాలని ఆయన మంత్రిని కోరారు. ప్రస్తుతం ఉన్న తుమ్మిళ్ల మోటార్ల ద్వారా ఆయకట్టుకు నీరు అందుతున్నప్పటికీ …అది తాత్కాలిక ప్రయోజనంగా మారుతుందని, రిజర్వాయర్లను నిర్మించి, ఆయకట్టుకు శాశ్వత ప్రయోజనం కల్పించి రైతులకు భరోసా ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు,ఇతర అధికారులు,బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
