

మన న్యూస్ సింగరాయకొండ:-
పేద, మధ్యతరగతి వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకం అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సింగరాయకొండ కందుకూరు రోడ్డులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మరియు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శంకుస్థాపన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “అన్నదానం మహాదానం అనే భావనతో ప్రతి పేద వ్యక్తికీ గౌరవమైన భోజనం అందించాలన్న దృక్కోణంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించబడ్డాయి,” అని పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించగా, అందులో భాగంగా సింగరాయకొండలో ప్రారంభం కాబోయే ఈ క్యాంటీన్ స్థానిక ప్రజలకు ప్రతి రోజు కేవలం ₹5కే నాణ్యమైన, పోషకాహార భోజనం అందించనుంది. ఇందులో ప్రతిరోజూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ క్యాంటీన్ ద్వారా పేదలకు ₹5కు భోజనం లభించడం, ప్రభుత్వ సంక్షేమ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.