మన ధ్యాస, నారాయణ పేట జిల్లా : జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ, ఊట్కూరు మండలాల పరిధిలో ఈ నెల 15 సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల ప్రచారం ముగించాలని, ఆ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ప్రచార కార్యక్రమాలు నిషేధం అని జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. మూడో విడత పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలో ఈ నెల 17న ఆయా మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుందని ఆమె తెలిపారు. ఈ నెల 15 వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని, ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఆమె తెలిపారు. 44 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో పై మండలాలలో ఎవరు కూడా బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదని అన్నారు. ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, ఎం.సి.సి బృందాలు, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. కాగా ఈ నెల 15వ తేదీ సోమవారం సాయంత్రం 5.00 గంటల నుండి ఎన్నికలు ముగిసే వరకు పై మండలాల్లో మద్యం షాపులను, కల్లు దుకాణాలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు.