

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని అయ్యప్పస్వామి దేవస్థానంలో శనివారం జరిగిన జిల్లా (ఒంగోలు కేంద్రం) బాల వికాస్ కేంద్రాల మాతాజీలు, అర్చకస్వాముల సమావేశానికి సమరసత సేవా ఫౌండేషన్ సింహపురి జోన్ ధర్మప్రచారక్ ఊరిమిండి వెంగలరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవాలయాలను కేంద్రంగా చేసుకొని నడుస్తున్న బాల వికాస్ కేంద్రాల్లో చిన్నారులకు ఆటలు, పాటలు, కళలు, జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలతో కూడిన విద్య అందిస్తున్నామని చెప్పారు. ప్రతి రోజు సాయంత్రం రెండు గంటలపాటు ఈ కేంద్రాలను నడపాలని మాతాజీలకు సూచించారు.భారతదేశ ఔన్నత్యాన్ని ప్రతిబింబించే మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పూర్వీకుల చరిత్ర గురించి చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పేర్కొన్నారు.అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రం పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో 25 దేవాలయాలు నిర్మించబడ్డాయని, అక్కడి వారికి అర్చక శిక్షణ ఇచ్చి, వారు ప్రస్తుతం అర్చక స్వాములుగా సేవలందిస్తున్నారని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా ధర్మప్రచారక్ గొల్లపొతు వెంకటేశ్వర్లు, బాల వికాస్ కేంద్రాల జిల్లా ఉపాధ్యాయ కన్వీనర్ అర్రిబోయిన రాంబాబు, సహ కన్వీనర్ చిలకపాటి సుధాకర్, మండల కన్వీనర్ చిమట సుధాకర్ పాల్గొన్నారు.
