

గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి నిర్వీర్యం..
“గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత..”
మన న్యూస్ తవణంపల్లె మే-9:- పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం పరిధిలోని అరగొండ – పల్లెచెరువు మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డును పూతలపట్టు శాసనసభ్యులు డా. మురళీమోహన్ పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం అరగొండ నుండి పల్లెచెరువు మార్గంలో దాదాపు 2.3 కిలోమీటర్ల పొడవుతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డును అధికారులు, నాయకులతో కలిసి ఆయన పరిశీలించి రోడ్డు నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “గత ప్రభుత్వం పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు. ఎక్కడ చూసినా రోడ్లు గుంతల మయంగా మారి, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆయన గుర్తు చేశారు. గత ప్రభత్వం అభివృద్ధి పేరుతో మాటలు చెప్పడమే తప్ప, పనులు చేయలేదని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ప్రతి పల్లె రోడ్డు మెరుగుపడాలి, ప్రతి చెరువు పునరుద్ధరించాలి, ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాలు చేరాలి అనే దృక్పథంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలియజేశారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గ్రామాలకు మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గుంత రోడ్లల్లో ప్రయాణించలేని స్దాయి నుండి రోడ్లపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ధైర్యంగా గమ్యస్ధానం చేరుకునే స్ధాయికి కూటమి ప్రభుత్వం రోడ్లను బాగు చేసి ప్రతి రూపాయని ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం ముఖ్య నాయకులు, మండల నాయకులు, అధికారులు పాల్గోన్నారు.
