

మన న్యూస్ సింగరాయకొండ:-
జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ, ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవధికారి సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఉలవపాడు మండలంలోని రామాయపట్నం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు గ్రామాలలో పేదరిక నిర్మూలన మరియు బాలల సంరక్షణ,హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పధకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందాలిని, 14 సంవత్సరాలలోపు బాల బాలికలు ఉచిత నిర్బంధ విద్యను అందుపుచ్చుకోవాలన్నారు.
అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత సేవలను పేద ప్రజలు వినియోగించుకోవాలని,పేదరిక నిర్మూలన దిశగా దేశం కొనసాగాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
కందుకూరు సబ్ కలెక్టర్ పూజ మాట్లాడుతూ ప్రతి గ్రామ సడక్ యోజన పథకం కింద ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని, అర్హత ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు అందని పక్షాన తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అదేవిధంగా
పిల్లలకు సంక్షేమము కొరకు ఉన్న అంగన్వాడీ, అనన్య ,మిషన్ వాస్తల్య, పోస్టర్ కేర్ వంటి పధకాలు సక్రమంగా అమలు అయ్యేందుకు కృషి చేయాలన్నారు.నాపిల్లలు నాయిష్టం అనడానికి తల్లిదండ్రుల హక్కు లేదని,గర్భస్థ శిశువులకు కూడా హక్కులున్నాయని బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ మరియు బాలలపై జరిగే నేరాలకై ఫోక్సో చట్టం ప్రకారం పిల్లలకు చట్టపరమైన రక్షణ కల్పించబడుతుందన్నారు.కందుకూరు డిఎస్పి బాలసుబ్రమణ్యం మాదక ద్రవ్యాలు , గంజాయి వినియోగించు వాటి వల్ల కలిగే అనర్ధాలు మరియు చట్టపరమైన చర్యలు గురించి వివరించారు.
అంగన్వాడి కార్యకర్తలు, వైద్య సిబ్బంది,విద్యా శాఖ, పోలీసు శాఖ మరియు డీఎల్ఎస్ఎ సిబ్బంది వారు చేసే కార్యక్రమాల గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఇవి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆకట్టుకున్నాయి. రామాయపట్నం హైస్కూల్ విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ అధ్యక్షత వహించగ కార్యక్రమంలో కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి బి రూపశ్రీ,కందుకూరు సీనియర్ సివిల్ జడ్జి శోభ, సింగరాయకొండ,కందుకూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు,సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, మండల తహసీల్దార్,కోర్టు సిబ్బంది, న్యాయ సేవా సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటుగా అందరు రామయపట్నం పోర్ట్ ను సందర్శించారు.
