తిరుపతి, మన ధ్యాస, అక్టోబర్ 5: –
మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఆటోమేటిక్గా రద్దు అవుతాయని న్యాయ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రాల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని సరస్వతీ శిశు మందిరంలో జరిగిన హిందూ ఉపాధ్యాయ సమితి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ – “మన సమాజంలోని కొందరు వ్యక్తులు ఇతర మతంలోకి మారినా దానిని దాచిపెట్టి ఎస్సీ రిజర్వేషన్ కింద లభించే సౌకర్యాలు, ఉద్యోగాలు, ప్రమోషన్లు పొందుతున్నారు. ఇది చట్టవిరుద్ధం. వీరిపై ఆధారాలతో కోర్టులో కేసులు వేస్తే ఆ రిజర్వేషన్ రద్దవుతుంది” అని తెలిపారు.సమావేశానికి అధ్యక్షత వహించిన హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షుడు డేగల రమేష్ మాట్లాడుతూ, “మతం మారి పదవులు, ఉద్యోగాలు పొందుతున్న వారి వల్ల నిజమైన హిందూ దళితులు నష్టపోతున్నారు. దీని మీద జాతీయ స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది” అని పేర్కొన్నారు.సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ – “హిందూ దళితుల హక్కుల రక్షణ కోసం నేను జి.డి. నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాను. ఇది కేవలం ఒకరి మీద మాత్రమే కాదు, వ్యవస్థలో నెలకొన్న లోపాలపై పోరాటం” అని వివరించారు.సమావేశంలో పలువురు పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ కింద ఎమ్మెల్యేలు అయిన వారిలో 21 మంది క్రైస్తవ మతం స్వీకరించారని ఆరోపించారు. టిటిడిలో కూడా అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారని, వారిని వెంటనే తొలగించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ రమాదేవి, హిందూ ధర్మ పోరాట నేత కిరణ్ తదితరులు పాల్గొన్నారు.









