

మన న్యూస్,తిరుపతిః– మంచినీళ్ళగుంట కాలుష్యం సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రుయా, స్విమ్స్, బర్డ్, మెటర్నీటి ఆస్పత్రుల వ్యర్థాలు భూమిలో కలిసిపోవడంతో మంచినీళ్ళగుంట కలుషితమైందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేష్, కార్పోరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యలు శనివారం సాయంత్రం మంచినీళ్ళగుంటను పరిశీలించారు. కార్పోరేటర్ నరసింహాచ్చారి ఆధ్వర్యంలో కార్పోరేటర్లు మంచినీళ్ళగుంట కలుషితంపై వివరాలను ఎమ్మెల్యే, కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎంతో పురాతనమైన మంచినీళ్ళగుంట తిరుపతిలోని ఐదు డివిజన్ ల పరిధిలోని ప్రజలకు తాగునీరు అందించడంలో మంచినీళ్ళగుంట కీలకంగా ఉండేదని కానీ 18 ఏళ్ళుగా గుంట కలుషితం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు కార్పోరేటర్ నరసింహాచ్చారి విన్నవించారు. గోవిందరాజస్వామి రాతి విగ్రహాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్, కమిషనర్ పరిశీలించారు. మంచినీళ్ళగుంట కాలుష్యం సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడంతోపాటు టిటిడి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గోవిందరాజ స్వామి అభిషేకంకు ఇప్పటికీ మంచినీటిగుంట నీటినే వాడుతున్నారని ఆయన తెలిపారు. మంచినీళ్ళగుంట కాలుష్యం తొలగింపుకు ఐఐటి నిపుణలు అభిప్రాయం త్వరలో తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ తెలిపారు. సుమారు 40వేల మందికి తాగునీరందించే మంచినీటిగుంట సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతోపాటు టిటిడి ఉన్నతాధికారులు, ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు ఆయన చెప్పారు. రుయా, స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల కారణంగా మంచినీళ్ళగుంట కలుషితమైందని ఆయన తెలిపారు. మంచినీళ్ళగుంట పునరుద్ధరణ, టిటిడికి అప్పగించడంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రుయాభివృద్ధి కమిటీ చైర్మన్ బండ్ల లక్ష్మీపతి రాయల్, రాష్ట్ర రజక అభివృద్ధి సంస్థ డైరెక్టర్ కరాటే చంద్ర, ఎన్డీఏ నాయకులు, మున్సిపల్ అధికారలు పాల్గొన్నారు.
