

ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం, వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ
పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- కరకగూడెం : పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.గురువారం ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడ్ వలస ఆదివాసీ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ ముఖ్య అతిథిగా హాజరై గ్రామంలోని సుమారు 50 కుటుంబాలకు దోమ తెరలను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ విధిగా దోమ తెరలను ఉపయోగించుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.అంతేకాకుండా సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతూ సమాజంలోని పేదలకు,అభాగ్యులకు అండగా నిలవడానికి అందరికి అవకాశం ఉందని కాబట్టి సేవాగుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు.అలాగే పేద గిరిజనుల ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రజల అవసరాలను సీజనల్ వారీగా గుర్తిస్తూ విశిష్ట సేవలందిస్తున్న ఫౌండేషన్ వారిని ప్రతేక్యంగా అభినందించారు. అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ..ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని దోమ తెరలతో ఆరోగ్యానికి భరోసా అని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో తమ ఫౌండేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై పీవీఎన్ రావు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
