చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల కోసం వందలాదిమంది బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్లి,ఆ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ కి మరియు డిఆర్ఓ మోహన్ కుమార్ కి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, అనాదిగా ఆదిపత్య పెత్తందారి సమాజంలో అణచివేత-పీడన- దోపిడీలకు గురవుతూ,అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న బీసీలకు ఎస్సీ,ఎస్టీల వలెనే ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ఎన్నికల వాగ్దానం చేశారన్నారు. ఏడాదిన్నర గడుస్తున్నా,ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. అలాగే చట్టసభలలో 33 శాతం, స్థానిక సంస్థలు-నామినేటెడ్ పదవులు-నామినేషన్ వర్క్స్ లలో 34 శాతం రిజర్వేషన్లు అమలు జరుపుతామని మరో వాగ్దానం చేసి ఉన్నారన్నారు. వాస్తవంగా బీసీ సమాజం ఎస్సీ-ఎస్టీలకు వలెనే బీసీలకు కూడా తమ జనాభా దామాషాలో రిజర్వేషన్లు అమలు జరపాలని కోరుకుంటున్నదన్నారు. ఏప్రిల్ తో స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగుస్తున్న వేళ, మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ అంటున్నదన్నారు. కానీ ఇంతవరకు రాష్ట్రంలో కుల గణనను సమగ్రంగా నిర్వహించకుండా, స్థానిక ప్రాదేశిక నియోజక వర్గాల విభజన పూర్తి చేయకుండా,బీసీలకు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు ఎలా నిర్వహిస్తారని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏప్రిల్ తరువాత ఆరు నెలల లోపు కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికలు జరిపే వీలున్నందున,ఈ లోపే రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరిపి,ప్రాదేశిక నియోజక వర్గాల విభజన పూర్తి చేసి, బీసీలకు 34 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమలు జరపాలన్నారు. రాజ్యాంగ- న్యాయపర చిక్కులన్నింటినీ అధిగమించి, కూటమి ప్రభుత్వం తప్పక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చేసిన తరువాతే, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వారు మెమొరండం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల జనాభా దామాషా మేరకు బీసీ సబ్ ప్లాన్ రూపొందించి,ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించి, ప్రత్యేక నోడల్ ఏజెన్సీల ద్వారా సక్రమంగా నిధులు ఖర్చయ్యేలా చూసి,బీసీల సాధికారితకు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతి లో మహాత్మా జ్యోతిబాపూలే-సావిత్రిబాయి ఫూలేల స్మృతి వనాన్ని సకల సదుపాయాలతో,ప్రపంచంలోనే అద్భుత కళాఖండంగా,దేశం గర్వించే రీతిలో నిర్మాణం జరపాలని వారు విజ్ఞప్తి చేశారు. సదరు 5 బీసీ సమాజ విజ్ఞాపనలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి ఆమోదించబడేలా,మా జిల్లా అత్యున్నతాధికారిగా కృషి చేయగలందులకు తమరి ఘనతను గురించి మీక్కిలి ప్రార్థించుచున్నాము.ఈ కార్యక్రమంలో ఎస్ చంద్ర, ఎస్ సెల్వరాజ్, ఎం హెచ్ డి పవన్ కళ్యాణ్, కే దిలీప్ కుమార్, ఎస్ కార్తీక్, జె మదన్ కుమార్, వి రవికుమార్, ఎస్ గోకుల్, కే లోకేష్, ఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *