

మన న్యూస్,తిరుపతి :- తిరుమల తిరుపతి దేవస్థానం ను వైసిపి నాయకులు అపవిత్రం చేసేందుకు లేనిపోని కుట్రలు చేస్తోందని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత భక్తులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు 24 గంటల పాటు తిరుమలలో ఉండి భక్తులకు సేవ చేస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తిపై వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. వైసీపీని రాష్ట్రంలోని ప్రజలంతా చీ కొట్టిన వారికి ఇంకా బుద్ధి రాలేదని, ఏదో ఒక విధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్రలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో తిరుమలలో ఉన్న ఆక్రమణలను టిటిడి పాలకవర్గం బిఆర్ నాయుడు నాయకత్వంలో ప్రక్షాళన చేపట్టారని, వాటన్నింటినీ జర్నించుకోలేక ఏదో ఒకటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. గతంలో వైసిపి నాయకులు ఎవరైనా తిరుమల అభివృద్ధి గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. టీటీడీ పాలకవర్గంతో పాటు ఈవో అదనపు ఈవో తిరుమల కు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు శ్రీవారి దర్శనాన్ని సులభతరముగా చేసుకునేలా ఏర్పాట్లు చేశారన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ లుగా ఉన్న వారు ఎవరైనా తలనీలాలు సమర్పించారు అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి తలనీలాలు సమర్పిస్తే ఆ కార్యక్రమం పై కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు లేనిపోని విమర్శలు చేశారని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు పాలకవర్గం అధికారులు చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించాల్సింది పోయి లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆర్ సి మునికృష్ణ ప్రశ్నించారు. ఇప్పటికైనా తిరుమల పై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు కార్యకర్తలకు హితవు పలికారు. ఈ సమావేశంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, టిడిపి తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు, విశ్వనాథం, గంజి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.