బంగారుపాళ్యం, మనధ్యాస, అక్టోబర్ 3

గత మూడు నెలలుగా మామిడి రైతుల సమస్య పరిష్కారంలో జరుగుతున్న విపరీత జాప్యాన్ని అరికట్టాలని, సత్వరం బిల్లులు చెల్లించాలని కోరుతూ ఈనెల 15న బంగారుపాళ్యంలో మామిడి రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు మామిడి రైతుల సంక్షేమ సంఘం, ఉమ్మడి జిల్లా కమిటీ తీర్మానించింది.శుక్రవారం మామిడి రైతుల సంక్షేమ సంఘం, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశం చిత్తూరులోని ఎస్టీయు కార్యాలయంలో టీ. జనార్దన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జనార్దన్, సి, మునీశ్వర్ రెడ్డి, కె. సురేంద్ర లు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా లో 50,000 మంది మామిడి రైతులకు గుజ్జు ఫ్యాక్టరీలు, ర్యాంపులు, మరియు ప్రభుత్వ సబ్సిడీ( 8+4) రూ12 చొప్పున రూ 500 కోట్లు చెల్లించాల్సి వుండగా నెలలుగా కాలయాపన చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.. ప్రభుత్వ ప్రోత్సాహకం రూ 4 కూడా గత నెల 20తేదీ నుండి వేస్తామని అధికారుల ప్రకటనలు సైతం నీరుగారిపోవడం బాధాకరమన్నారు.గత మూడు నెలలుగా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తూ పోరాటం సాగిస్తున్నా కదలిక లేకపోవడం దారుణం అన్నారు. ఈ నేపథ్యంలో అఖిల పక్ష రాజకీయ పార్టీల తోడ్పాటుతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కమిటీ నిర్ణయించింది. ఫ్యాక్టరీల వైఖరి ఎండగట్టేందుకు, ప్రభుత్వంపై వత్తిడి తీసుకు వచ్చేందుకు ఈనెల 15వ తేదీన జరుగు మామిడి రైతు గర్జన సభకు , స్థానిక శాసనసభ్యులు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైసిపి, బిజెపి, జనసేన,బీసీవై, పార్టీల రాష్ట్ర నేతలు మరియు రాష్ట్ర రైతు సంఘం నేతలను సైతం ఆహ్వానిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు, జనార్ధన్, మునీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.15 జరిగే రైతు గర్జన సభకు బంగారుపాళ్యం కు వేలాదిగా మామిడి రైతులు కదలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు.ప్రధాన కార్యదర్శిగా మునీశ్వర్ రెడ్డి,జిల్లా కమిటీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రధాన కార్యదర్శిగా సి.మునీశ్వర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కె. సురేంద్ర, ఉపాధ్యక్షులుగా జి.త్యాగరాజ రెడ్డి సహాయ కార్యదర్శిగా బి. శ్రీనివాసులు ల ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు అధ్యక్షులు టి.జనార్ధన్ ప్రకటించారు.ఈ సమావేశం లో ఉపాధ్యక్షులు,ఎ. ఉమాపతి నాయుడు,మునిరత్నం నాయుడు, భారతి, బి. మురళి,త్యాగరాజు రెడ్డి,సహాయ కార్యదర్శులు, వి. సందీప్, బి. శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.









