ఉరవకొండ,మన న్యూస్:
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తు తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధమైనది కాదంటూ, హైకోర్టు రిజిస్ట్రార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉరవకొండ పౌర సమాచార అధికారి ఇచ్చిన తిరస్కరణ ఉత్తర్వులను కొట్టి పారేస్తూ, అభ్యర్థించిన సమాచారాన్ని ఆలస్యం లేకుండా అందించాలని ఆదేశించారు. విడపనకల్ మండలం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన కురువ లక్ష్మీనారాయణ, ఉరవకొండ మెజిస్ట్రేట్ కోర్టు పరిధిలోని సూపరిండెంట్ (పౌర సమాచార అధికారి) కి, సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(1) ప్రకారం, మూడు అంశాలకు సంబంధించిన వివరాలను కోరుతూ 03-03-2025 నాడు దరఖాస్తు చేశారు. వాటిలో ముఖ్యంగా:

  1. క్రైం నెం. 302/2020 కేసు చార్జ్‌షీట్ ఫైలింగ్ ఆలస్యానికి సంబంధించిన సమాచారం,
  2. ఆలస్యం కారణాలు, సాక్షుల స్టేట్‌మెంట్లు,
  3. చార్జ్‌షీట్ దాఖలు కాల వ్యవధి పై స్పష్టత కోరారు.

అయితే, పౌర సమాచార అధికారి 12-03-2025 నాటికి, “న్యాయ సంబంధిత కేసుల రికార్డులు ఆర్టీఐ ద్వారా ఇవ్వలేము” అంటూ తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం దరఖాస్తు చేయాల్సిందిగా సూచించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కురువ లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ (అప్పీల్ అధికారిని) ఆశ్రయించారు. 28-04-2025 నాటికి అప్పీల్ దాఖలు కాగా, రెండు పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న రిజిస్ట్రార్, తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధమైనదికాదని తేల్చారు. హైకోర్టు రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో, అభ్యర్థి కోరిన సమాచారాన్ని వెంటనే అందించాలని స్పష్టంగా ఆదేశించారు. ఈ ఉత్తర్వుల మేరకు సత్యం వెలుగులోకి వచ్చిందని కురువ లక్ష్మీనారాయణ ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *