రేణిగుంట ఆగష్టు 15.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రేణిగుంట సీపీఎం పార్టీ కార్యాలయం పై “త్రివర్ణ పథకం జాతీయ జెండా” ను స్థానికుడు రాధాకృష్ణ చేతుల మీదుగా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం చిన్నారులచే జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఓ. వెంకటరమణ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం, జీవించే హక్కు, సామాజిక న్యాయం కల్పించడమే నిజమైన స్వాతంత్ర్యమని అన్నారు. దేశ అభివృద్ధిలో యువత, విద్యార్థులు, మహిళల పాత్ర కీలకమని, రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని అన్నారు.
సిఐటియు మండల కన్వీనర్ సెల్వరాజ్ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ మత, కుల, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానికుడు రాధాకృష్ణ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సిపిఎం పార్టీ నాయకులు హరినాథ్, వెంకటరమణ, సెల్వరాజ్, మునిస్వామి, సులోచన, గీత, నిర్మల, సంతోషిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
